👉 ఓ తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతీశీని త్వరలో అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ జోస్యం😲😲😲
ఢిల్లీ సీఎం అతీశీని త్వరలో అరెస్టు చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అంతకంటే ముందే ఆప్ సీనియర్ నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడులు జరుపుతాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,100 మహిళా సమ్మాన్ యోజన కింద ఇచ్చే పథకంతో పాటు వృద్ధులకు ఉచిత వైద్యం అందించే సంజీవని యోజన పథకానికి అనూహ్య స్పందన వస్తుండటంతో బీజేపీ అధిష్టానం బెంబేలెత్తిపోతోందన్నారు.అందుకే ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా అతీశీని తప్పుడు కేసులో అరెస్టు చేయించే యోచనలో ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు తనను తప్పుడు కేసులో అరెస్టు చేసినా.. తర్వాత నిజమేంటో అందరికీ తెలుస్తుందని అతీశీ చెప్పారు.మరోవైపు, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 రోజుల పాటు మద్దతు ఇవ్వడం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, అదే తాము చేసిన పొరపాటని కాంగ్రెస్ పార్టీ నేత మాకెన్ అన్నారు.
👉 మోడీ ప్లాన్: జమిలి గట్టెక్కించే బాధ్యత !!!చంద్రబాబుకు? అంటే.. చంద్రబాబు సారథ్యంలో కమిటీ వేసి.. అది అన్ని రాష్ట్రాల పార్టీలను.. అధికార పక్షాలను కలుసుకుని.. లేదా సంప్రదించి.. జమిలి బిల్లుకు ఒప్పించే ప్రయత్నం చేయనున్నారన్న మాట. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాను అనుకున్నది సాధించే నాయకుడు. ఈ క్రమంలో ఆయన ఏవైనా ఇబ్బందులు వస్తే..వాటిని పరిష్కరించేందుకు..మిత్రపక్షాలను ఆశ్రయిస్తారు.ఆ తర్వాత.. సర్దుబాటు దిశగా అడుగులు వేస్తారు. 2016లో దేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సహా.. మేధావి వర్గాలు కూడా తప్పుబట్టాయి. ఈ సమయంలో అందరినీ సర్దు బాటు చేయడానికి.. మోడీ ప్లాన్ చేశారు.
ముఖ్యమంత్రులతో కూడిన కమిటీ వేస్తున్నట్టు ప్రకటించి.. దానికి కన్వీనర్గా అప్పటి సీఎం చంద్రబాబు ను నియమించారు. ఈ కమిటీ అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, విపక్ష నేతలతో భేటీ అయి.. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు పై అన్ని వర్గాలను ఒప్పించాయి. తర్వాత రగడ తేలిపోయి.. మోడీ హీరో అయిపోయారు. ఇక, మూడు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన మోడీకి మరింత సెగ తగిలింది. అయినా.. ఆయన పట్టుబట్టి.. అమలు చేయాలని అనుకున్నారు. కానీ, బెడిసి కొట్టింది. దీనికి కారణం.. సొంత నేతలేనని అంటారు. కేవలం బీజేపీ నాయకులతో ఆయన కమిటీ వేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఒకే దేశం-ఒకే ఎన్నికల మంత్రాన్ని ప్రధాని మోడీ పఠిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసి.. ఒక నివేదికను తెప్పించుకున్నారు.(ఇది కూడా అనుకూలమేలేండి!) దీనిని ఇటీవల లోక్సభలో ప్రవేశ పెట్టారు. పెద్ద ఎత్తున యాగీ జరిగింది. కాంగ్రెస్ సహా.. విపక్షాలన్నీ.. ఒకే జట్టుగా నిలిచాయి. ఈ విషయాన్ని తూర్పారబట్టాయి. ఇక, మిత్రపక్షాలైన బిహార్కు చెందిన జేడీయూ వంటివి మౌనంగా ఉన్నాయి. దీంతో మోడీ గుండెల్లో రాయి పడింది. దీంతో ఇప్పుడు జమిలి బిల్లు ఇప్పుడు కాకపోతే.. మరో మూడు మాసాల తర్వాతైనా..పార్లమెంటుకురానుంది.(జేపీసీ వేశారు కదా.. అది అధ్యయనం చేయాల్సి ఉంది).ఈ క్రమంలో ఇటు మిత్ర పక్షాలతో పాటు.. అటు ప్రతిపక్షాలు కూడా.. దీనిని ఆమోదించేలా కొంతలో కొంతైనా వారిని ఒప్పించేలా చేయాలన్నది మోడీ ఆలోచన. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆదిశగా నడిపించేందుకు ప్రధాని వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. చంద్రబాబు సారథ్యంలో కమిటీ వేసి.. అది అన్ని రాష్ట్రాల పార్టీలను.. అధికార పక్షాలను కలుసుకుని.. లేదా సంప్రదించి.. జమిలి బిల్లుకు ఒప్పించే ప్రయత్నం చేయనున్నారన్న మాట. ఇక్కడ చంద్రబాబునే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న వస్తుంది. దేశంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో సీనియర్ కావడం.. `విజన్ బాబు` అనే బ్రాండు ఉండడం.. వంటివి మోడీకి కలిసి వస్తున్న అంశాలు. ఆయనైతే.. సమర్థవంతంగా అందరినీ ఒప్పించే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
👉బీజేపీలోకి వంశీ… టీడీపీకి షాకేనా ? వంశీ మీద కేసులు ఉంటాయని ఆయనను ఇబ్బందుల పాలు చేస్తారని వార్తలు వినవస్తున్న నేపధ్యంలో కూటమిలో కీలకమైన బీజేపీలో చేరడం ద్వారా ఆయన అధికార కూటమి నేత అవుతారు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఒక సారి ఎంపీ టికెట్ ని రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ని అందుకుని రెండు సార్లు వరసగా విజయవాడ గన్నవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారు వల్లభనేని వంశీ. అంగబలం అర్ధబలం ఉన్న వంశీని టీడీపీ బాగానే ప్రోత్సహించింది. ఆయన కూడా పార్టీ ఇచ్చిన అవకాశాలను వాడుకుంటూ దూకుడుగానే రాజకీయం చేశారు. అయితే 2019లో టీడీపీ ఓటమి తరువాత ఆయన అడుగులు వైసీపీ వైపు పడ్డాయి. అలా ఆయన జగన్ సమక్షంలో ఫ్యాన్ నీడకు చేరారు. అప్పటి నుంచి ఆయన టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక దశలో చంద్రబాబు లోకేష్ ల మీద వ్యక్తిగత విమర్శలూ ఎక్కుపెట్టారు. అవి కాస్తా అతి పెద్ద వివాదానికి కూడా దారి తీశాయి. ఆ పరిణామాల నేపధ్యం కూడా వంశీకి కంచుకోట లాంటి గన్నవరంలో 2024 ఎన్నికల్లో ఆయన ఓటమికి దారి తీసిందని అంటారు. ఇక గడచిన ఆరు మాసాలుగా వంశీ అయితే పెద్దగా చడీ చప్పుడూ చేయడం లేదు. ఆయన మీద టీడీపీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని కేసులు పెడుతుందని కూడా ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఆయన ఉండేది హైదరాబాద్ లోనా లేక అమెరికాలోనా అన్నది అయితే తెలియడం లేదు. మొత్తానికి ఆయన వైసీపీకి బహు దూరంగా ఉంటూ వస్తున్నారు అన్నది అయితే తేలిపోయింది అంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎటూ టీడీపీ జనసేనలలో ప్రవేశానికి అవకాశం లేనందువల్ల కూటమిలో మూడవ పార్టీ అయిన బీజేపీలో చేరాలని చూస్తున్నారు అని వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. వంశీ మీద కేసులు ఉంటాయని ఆయనను ఇబ్బందుల పాలు చేస్తారని వార్తలు వినవస్తున్న నేపధ్యంలో కూటమిలో కీలకమైన బీజేపీలో చేరడం ద్వారా ఆయన అధికార కూటమి నేత అవుతారు అని అంటున్నారు. ఆయన గతంలో చంద్రబాబు ఫ్యామిలీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల టీడీపీ క్యాడర్ అంతా పూర్తి ఆగ్రహంతో ఉన్నారని అదే విధంగా ఆయన పదేళ్ల ఎమ్మెల్యే పాలనలో అక్రమాలు చేశారా అంటూ ఆరా తీసే పనులలో ఉన్నారని ఆ విధంగా ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు. దాంతో వైసీపీలో ఉంటే కచ్చితంగా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన వంశీ బీజేపీ వైపుగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే కనుక జాతీయ పార్టీ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారని అందుకే ఈ మాస్టర్ పొలిటికల్ స్కెచ్ గీసారని అంటున్నారు. ఇదిలా ఉండగా వంశీ సాధ్యమైనంత తొందరలో కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని కలుస్తారని జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. ఈ వార్తలు అయితే ప్రస్తుతం విజయవాడలో గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉంటే వంశీని వైసీపీలోకి తెచ్చి ఆ పార్టీ బావుకున్నది ఏమీ లేదని అంటున్నారు. పైగా ఆయన అనుచితా వ్యాఖ్యల పరిణామాల వల్ల వైసీపీ భారీ మూల్యం గత ఎన్నికల్లో చెల్లించాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. ఆయన అపుడు కూడా షెల్టర్ కోసమే వైసీపీని ఆశ్రయించి ఆ పార్టీలో చేరారు అని విమర్శలు చేస్తున్న వారూ ఉన్నారు. పార్టీకి ఎంతో విధేయులుగా ఉన్న యార్లగడ్డ వెంకటరావుకు టికెట్ ని నిరాకరించి మరీ వంశీకి ఇవ్వడం ద్వారా వైసీపీ తన ఓటమిని తానే కొని తెచ్చుకుందని అంటున్నారు. ఇపుడు వైసీపీ ఓటమితో వంశీ తన రాజకీయాన్ని తాను చూసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా వంశీని బీజేపీ తీసుకోవడం ద్వారా టీడీపీకి ఏ విధంగా సమాధానం చెబుతుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. టీడీపీ జనసేన వద్దు అనుకున్న పార్టీలను బీజేపీ చేరదీయడం ద్వారా తన బలం పెంచుకోవడం పక్కన పెడితే కూటమిలో ఇబ్బందులకు దారితీస్తుందా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. వల్లభనేని వంశీని బీజేపీ చేర్చుకోవడం ద్వారా ఏమి సాధిస్తుందో కానీ వంశీకి మాత్రం అధికారికంగా ఒక రక్షణ లభిస్తుందని అంటున్నారు. చూడాలి మరి బీజేపీలో వంశీగానం ఏ విధంగా ఉంటుందో.
👉 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.
ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతోందన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు. అలాగే రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.పార్టీ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ప్రజాప్రతినిధులందరూ నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్కు రాహుల్ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో, రాహుల్ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళతామంటూ ఇటీవల రాహుల్కు పొన్నం లేఖ రాశారు.ఆ లేఖకు స్పందనగా రాహుల్ మంత్రికి లేఖ రాసి, అభినందనలు తెలిపారు.
👉నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలు అందించడంతో పాటు ఇంకా అవసరం ఉన్న సౌకర్యాలను 24గంటల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.హైదరాబాద్ తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతీ రోజూ 1500 మంది అవుట్ పేషెంట్లు, 1000 మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ప్రతీ నెలా సుమారు 600 ప్రసవాలు జరుగుతాయని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశానని, తిరిగి ప్రస్తుతం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అధునాతన పరికరాలు అందజేసినట్లు చెప్పారు.
👉 ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా కర్నాటకలోని బెల్గాంలో రెండు రోజుల పాటు జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి గురువారం వెళ్లనున్నారు. ఆయనతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహే్షకుమార్గౌడ్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీడబ్ల్యుసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత జీవన్రెడ్డి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో బెల్గాంకు వెళ్లనున్న వీరు.. రెండు రోజుల పాటు జరిగే సీడబ్ల్యుసీ, ఏఐసీసీ సమావేశాల్లో పాలు పంచుకుంటారు.
👉 వాల్తేరు డివిజన్ను విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా జోన్లో కొనసాగించే విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడితో కలిసి ఢిల్లీలో బుధవారం రైల్వే మంత్రిని కలిసినట్టు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖలో కొత్త రైల్వే జోన్తో పాటు వాల్తేరు డివిజన్ను కొనసాగించాలని కోరగా తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే కొత్త రైళ్లు, రైల్వే కనెక్టివిటీపై కూడా పలు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఐటీ రంగంలో ఏపీకి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి అనువైన డీప్ టెక్ విధానాలపై మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారన్నారు. రాష్ట్రంలో ఐటీ, మౌలిక వసతులు, రవాణా రంగాల్లో అభివృద్ధికి ఈ చర్చలు దోహదపడతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు.
👉తిరుపతి. 25 కేజీలు గంజాయి పట్టివేత..ముగ్గురు నిందితులు అరెస్ట్..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల చెరువు వద్ద పోలీసులకు పట్టుబడ్డ వైనం. నిందితులు..గాంధీ పురం పంచాయతీ ధనలక్ష్మి నగర్ కు చెందిన చాంద్ బీ..మల్లం గుంట పంచాయతీ వినాయక నగర్కు చెందిన సాయి. ములకలచెరువు మండలం బురకాయల కోటకు చెందిన రసూల్ బీ గా గుర్తింపు.గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి తిరుపతిలో విక్రయం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడి.ముగ్గురుని అరెస్టు చేసి రిమాండ్ పంపిన తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు.
👉 బిగ్ బ్రేకింగ్ న్యూస్ .. చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్..
కామారెడ్డి – సదాశివనగర్ మండలం, అడ్లూర్లో ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్ శృతి..
అయితే, ఆమెతో పాటు మరో ఇద్దరు.. బిక్కనూరు ఎస్సై సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా చెరువులో దూకినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు..
భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్..బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శృతి..బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్.. చెరువు కట్టపై ఎస్సై సాయికుమార్ పర్సనల్ కారు..స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి కోసం గాలింపు. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్పీ సింధు శర్మ..ముగ్గురి మధ్య వ్యక్తిగత సంబంధాల కారణంగా ఈ దారుణం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
*ఓ తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతీశీని త్వరలో అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ జోస్యం!!! …*మోడీ ప్లాన్: జమిలి గట్టెక్కించే బాధ్యత.. చంద్రబాబుకు? … *తెలంగాణ ప్రభుత్వానికి లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు … *బీజేపీలోకి వంశీ… టీడీపీకి షాకేనా ? .. *వాల్తేరు డివిజన్ను విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా జోన్లో కొనసాగించే విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలం … *నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాల అందజేత … *25 కేజీలు గంజాయి పట్టివేత..ముగ్గురు నిందితులు అరెస్ట్ (తిరుపతి).. *చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్..
Recent Posts